ఏపీలో పలు వైసీపీ నేతలు అరెస్టు అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి, సినీ నటి రోజా కూడా అరెస్టు అవుతారని పలువురు టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో టీడీపీ నేత అతి త్వరలో రోజా అరెస్ట్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
మాజీ మంత్రి రోజా త్వరలోనే అరెస్ట్ అవుతారని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని, క్రీడా సామగ్రి కొనుగోళ్లలో రూ.119 కోట్లకు పైగా నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. ఇక తిరుమల టికెట్ల దందాలో కూడా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని విమర్శించారు. నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని రోజా భయపడుతున్నారన్నారు.