అమరావతి: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో ప్రస్తుతం ఇద్దరు వెంటిలేటర్పై ఉన్నారని, మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. బాధితుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. కల్తీ పాలు విక్రయించిన నిందితుడు నాగేశ్వరరావును ఇప్పటికే అరెస్టు చేశామని, ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం హెచ్చరించారు.
జిల్లాలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, కొంతమంది వృద్ధులకు కిడ్నీ సమస్యలు కూడా తలెత్తాయని నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా అధికారులు సీఎంకు తాజా పరిస్థితిని వివరించారు. బాధితులకు అందుతున్న వైద్యం, ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫీల్డ్ లెవల్ క్యాంపులు మరియు రాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.