తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సహాయం పేరుతో పరిచయం పెంచుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. చివరకు స్నేహితురాలి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. ఇటీవలే మరో హాస్టల్కు మారేందుకు ఆమె ర్యాపిడో ఆటో బుక్ చేసుకుంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ సాయికుమార్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న సాయికుమార్, తరచూ ఫోన్ చేస్తూ మాటలు కలిపాడు. ఏదైనా అవసరం ఉంటే చెప్పమని నమ్మబలికాడు.
కొన్ని రోజుల తర్వాత బాధితురాలికి డబ్బు అవసరం పడటంతో సాయికుమార్ను అడిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు, ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర భయానికి లోనైన విద్యార్థిని, జరిగిన విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె ధైర్యం చెప్పడంతో అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు నిందితుడు సాయికుమార్పై క్రైమ్ నెంబర్ 448/2025 పొక్సో యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.