ఎంపీ రఘురామ కృష్ణరాజు వైఎస్సార్సీపీకి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే..! 2019 ఎన్నికల్లో గెలిచిన ఏడాది తర్వాత పార్టీకి రెబల్గా మారారు. ఇక ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా మారిపోయాయి. గత రెండేళ్లుగా నియోజకవర్గానికి వెళ్లలేకపోయారు. కరోనాతో పాటూ వరుసగా కేసులు వెంటాడటంతో నర్సాపురంలో అడుగు పెట్టలేకపోయారు. ఇక వైసీపీకి దూరం భారీగా పెరిగిపోగా.. పార్లమెంట్ లో కూడా అంతే దూరంగా వైసీపీ నేతలకు ఉండాలని రఘురామ భావిస్తూ ఉన్నారు.
లోక్ సభలో తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని.. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంట్ భవనంలో వైసీపీ సభ్యుల సరసన కాకుండా.. వేరుగా సీటు కేటాయించాలని స్పీకర్ను కోరారు. తనను వైసీపీ ఎంపీగా కాకుండా.. స్వతంత్ర సభ్యుడిగా పరిగణించాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. సభలో వైసీపీ సభ్యులు నన్ను మాట్లాడనివ్వడం లేదని.. సొంత పార్టీ నేతలే నాపై దాడి చేస్తారన్న భయం ఉందని చెప్పుకొచ్చారు.