ఆర్టీసీలో 7,673 ఖాళీలు.. త్వరలో గుడ్న్యూస్..!
రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో APSRTCలోని పలు అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
By - Medi Samrat |
ఏపీలో ఉద్యోగులకు గుడ్న్యూస్
రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో APSRTCలోని పలు అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాలు, బకాయిల చెల్లింపులు, వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియామకాలు, సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసుల స్థితిగతులపై మంత్రి విస్తృతంగా చర్చించారు.
2025–26 DPC కింద అర్హులైన 7,514 మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, 20-02-2026లోపు ఎంప్యానెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. లెవెల్స్ 3, 4, 5 & EEల సీనియారిటీ జాబితాల ఆధారంగా DPCలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
నియామకాలు – ఖాళీల భర్తీపై చర్చ
వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 2020లో 51,488 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 44,131 మంది మాత్రమే సేవలలో ఉన్నారని, 2026, 2027, 2028 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నారని వివరించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులకు ప్రాధాన్యతతో భర్తీ చేయాలని మంత్రి సూచించారు.
వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల అంశం
01-01-2020 నుంచి వైద్య కారణాలతో 682 మంది ఉద్యోగులు రిటైర్ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగం, మిగిలిన 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉందని వివరించారు. ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షల చొప్పున మొత్తం ఆర్థిక భారం రూ.96.90 కోట్లుగా అంచనా వేశారు.
ఉమ్మడి కడప ప్రాంతంలో కండక్టర్ ఖాళీలు లేకపోవడంతో 191 కారుణ్య నియామక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 28-09-2023, 29-09-2023 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైనా ఇప్పటివరకు నియామకాలు జరగలేదని, APSRTC పదేపదే ఫాలోఅప్ చేసినా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని అధికారులు మంత్రికి వివరించారు. కడప ప్రాంతానికి చెందిన 80 మంది కండక్టర్లు ఇతర రీజియన్లలో పని చేస్తున్నారని తెలిపారు.
సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసులపై సమీక్ష
వివిధ కేడర్ల సీనియారిటీ జాబితాల పునఃపరిశీలనకు 30-01-2026న మెమో జారీ చేసినట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ మెమోల ప్రకారం సీనియారిటీ జాబితాల సమీక్ష జరుగుతుందని, 2016 తర్వాతి ప్రమోషన్ ఫైళ్లు APSRTC వద్ద, 2016కు ముందు రికార్డులు TGSRTC వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని రికార్డులు సమీకరించడానికి కనీసం 45 రోజులు అవసరమని తెలిపారు. రవాణా శాఖకు సంబంధించిన 88 కాంటెంప్ట్ కేసులు పెండింగ్లో ఉండగా, వాటిలో 23 కేసుల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రతివాదిగా ఉన్నారని, న్యాయ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.