యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది, గిన్నిస్ రికార్డుపై ప్రధాని హర్షం

విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

By Knakam Karthik
Published on : 22 Jun 2025 4:01 PM IST

Andrapradesh, Narendra Modi, Visakhapatnam, Yoga, Guinness World Record, International Yoga Day

యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది.. గిన్నిస్ రికార్డుపై ప్రధాని హర్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన శనివారంవిశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు జరుగుతున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. యోగా ప్రాముఖ్యతను మరోసారి నొక్కిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేసిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. "యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేసిన విధానానికి అభినందనలు. నేను కూడా పాల్గొన్న విశాఖపట్నంలోని యోగాంధ్ర కార్యక్రమం అనేక మందిని మంచి ఆరోగ్యం, శ్రేయస్సు దిశగా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది" అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇది ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని తన సందేశంలో స్పష్టం చేశారు. ప్రజలంతా యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు యోగా విస్తరణకు చేస్తున్న కృషి ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story