'వెన్నుపోటు పొడిచారు'.. చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి హాట్ కామెంట్స్ చేశారు. కాపులని మెగాస్టార్ చిరంజీవి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
By అంజి Published on 8 May 2024 3:54 PM IST
'వెన్నుపోటు పొడిచారు'.. చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి హాట్ కామెంట్స్ చేశారు. కాపులని మెగాస్టార్ చిరంజీవి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని అన్నారు. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారని ఆరోపించారు. చిరంజీవి రాజకీయాలకు అనర్హుడని పోసాని పేర్కొన్నారు. అతను (చిరు) ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడనే ఆశతో పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నాడని ఆరోపించారు. “ఏమో గుర్రం ఎగరవచ్చు” అంటూ పోసాని సెటైర్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి వీడియో బైట్ ద్వారా పవన్ కళ్యాణ్, అతని జనసేన పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు.
ఈ క్రమంలోనే వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని.. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా 18 సీట్లు గెలుచుకున్నారు, కానీ ఆయన ఏనాడూ అసెంబ్లీలో కూర్చోలేదని పోసాని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏనాడూ చిరంజీవి ప్రయత్నింలేదన్నారు. ఐదేళ్లు ప్రతిపక్షంగా అసెంబ్లీలో కూర్చోని పార్టీని అమ్ముకున్న ఆయనకు రాజకీయాలు కేవలం వ్యాపారమేనని అన్నారు. సినిమా అయినా, రాజకీయమైనా చిరంజీవికి అది కేవలం వ్యాపారమేనని, తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్కి అమ్మేశాడని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రానని చెప్పి, ఇప్పుడు మళ్ళీ జనసేన తరపున ఎలా ప్రచారం చేస్తారని చిరంజీవిని పోసాని ప్రశ్నించారు.