పోలవరం ప్రాజెక్టు.. ఏపీ రైతులకు వరం: మంత్రి పయ్యావుల

పోలవరం ప్రాజెక్టు ఒక్క జిల్లాకే పరిమితం కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి వరం లాంటిదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు.

By అంజి
Published on : 5 Jan 2025 8:28 AM IST

Polavaram, Farmers, APnews, Minister Payyavula Keshav

పోలవరం ప్రాజెక్టు.. ఏపీ రైతులకు వరం: మంత్రి పయ్యావుల

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు ఒక్క జిల్లాకే పరిమితం కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి వరం లాంటిదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేశవ్.. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు ఒక్క జిల్లాకే కాదు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి వరమని అన్నారు.

''పట్టిసీమ ప్రాజెక్టుకు ముందు రాయలసీమలో నీటి వివాదాలు ఉండేవి. తుంగభద్ర హైలెవల్ కెనాల్‌లో నీళ్లు తక్కువగా వస్తే.. రెండు టీఎంసీల నీటిని కర్నూలు నుంచి మళ్లించి ఇవ్వమని అనంతపురం రైతులు ధర్నా చేసేవారు. కర్నూలు వాళ్లు ఇవ్వొద్దని ధర్నా చేసేవారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తైన తర్వాత రైతుల ఆందోళనలు తగ్గాయి. శాసనసభలో కరువు గురించి చర్చలు అరుదుగా మారాయి, ఒక చిన్న ప్రాజెక్ట్ రాయలసీమలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది'' అని మంత్రి పయ్యావుల అన్నారు.

కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతాలకు సాగునీటిని అందించే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి బానకచర్ల వంటి కీలకమైన ప్రాంతాలకు నీటిని తీసుకురావడంపై దృష్టి సారించినట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. పోలవరం పూర్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని, బానకచర్లకు నదుల అనుసంధానం ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఐదేళ్లుగా పోలవరం పనులు ఎవరు ఆపారు.. దానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. మా హామీలు మాకు తెలుసు, ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. మేం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ప్రతిపక్షాలను కేశవ్ విమర్శించారు.

Next Story