విశాఖలో గూగుల్‌ హబ్‌పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.

By -  Knakam Karthik
Published on : 14 Oct 2025 4:09 PM IST

Andrapradesh, Vishakapatnma, Google AI hub, Google CEO Sundar Pichai, PM Modi

విశాఖలో గూగుల్‌ హబ్‌పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది 'వికసిత భారత్' నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.

"చైతన్యవంతమైన నగరం విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉంది" అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు. గిగావాట్-స్థాయి డేటా సెంటర్ మౌలిక సదుపాయాలతో కూడిన ఈ భారీ పెట్టుబడి, సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో శక్తివంతమైన చోదకశక్తిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది 'అందరికీ ఏఐ'ని అందిస్తుందని, పౌరులకు అత్యాధునిక సాధనాలను అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. తద్వారా మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై, ప్రపంచ టెక్నాలజీ లీడర్‌గా భారత్ స్థానం సుస్థిరమవుతుందని ప్రధాని మోదీ అన్నారు.

అంతకుముందు, ప్రధాని మోదీతో మాట్లాడటం గొప్ప అనుభూతినిచ్చిందని సుందర్ పిచాయ్ తెలిపారు. "విశాఖపట్నంలో గూగుల్ మొట్టమొదటి ఏఐ హబ్ ఏర్పాటు ప్రణాళికలను ఆయనతో పంచుకున్నాం. ఇది ఒక చరిత్రాత్మక అభివృద్ధి" అని పిచాయ్ పేర్కొన్నారు. ఈ హబ్‌లో గిగావాట్-స్థాయి కంప్యూట్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలు ఉంటాయని ఆయన వివరించారు. దీని ద్వారా తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలకు, వినియోగదారులకు అందించి, దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేస్తామని తెలిపారు.

Next Story