పెద్దిరెడ్డి కుటుంబం రూ.30 వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు

ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్ర పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు.

By అంజి  Published on  7 May 2024 1:30 PM GMT
Peddireddy family, Chandrababu, TDP, YCP, APPolls

పెద్దిరెడ్డి కుటుంబం రూ.30 వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు

ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్ర పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు సభలో మాట్లాడుతూ.. ''జగన్‌ సీఎం అయ్యాక మద్యం, కరెంటు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచారు. పెంచిన మద్యం ధరల్లో జగన్‌, పెద్దిరెడ్డి వాట ఎంతో చెప్పాలి. జూన్‌ 4 తర్వాత వారి నుంచి అవినీతి సొమ్మును కక్కించి పేదలకు పంచుతాం'' అని చెప్పారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లిందని, ప్రజలకు ఈ రోజే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.

రేపటి నుంచి అన్నీ మంచిరోజులేనని అన్నారు. గెలిచేది మనమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చల్లా బాబు అంటూ కామెంట్‌ చేశారు. చల్లా బాబు ఓ బుల్లెట్, దూసుకెళతాడని అన్నారు. రామచంద్రారెడ్డీ మిడిసిపడుతున్నావు.. కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. నల్లారి కుటుంబం ఒక రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం.. ఆయన తండ్రి రాజకీయ నాయకుడు, ఆయన రాజకీయ నాయకుడు. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే, ఒకటి నేను, రెండు కిరణ్ కుమార్ రెడ్డి అని చంద్రబాబు వివరించారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక మద్యం ధరలు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయని చంద్రబాబు అన్నారు. చివరికి చెత్తపై కూడా పన్ను వేశారని అన్నారు. 2019లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని, మద్యపాన నిషేధం అన్నారని, ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. పెంచిన మద్యం ధరల్లో జగన్‌, పెద్దిరెడ్డి వాటా ఎంత? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి సొమ్మును కక్కించి జూన్‌ 4 తర్వాత పేదలకు పంచుతాం చంద్రబాబు ప్రకటించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు సభలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబు రోడ్లు మంజూరు చేస్తే పెద్దిరెడ్డి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి కూడా కమీషన్లు తీసుకునే వ్యక్తికి ఓట్లు వేయొద్దన్నారు. పెద్దిరెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరమని అన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు వేయాలని కిరణ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డి తన కాల్లు పట్టుకున్నారని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

Next Story