వైసీపీపై ప‌వ‌న్ మండిపాటు.. బీజేపీ వ‌ల్లే సీట్లు త‌గ్గాయి..!

Pawan Kalyan Fires On YSRCP. వైసీపీపై జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీది దౌర్భాగ్యపు..

By Medi Samrat  Published on  23 Sep 2021 4:09 PM GMT
వైసీపీపై ప‌వ‌న్ మండిపాటు.. బీజేపీ వ‌ల్లే సీట్లు త‌గ్గాయి..!

వైసీపీపై జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీది దౌర్భాగ్యపు.. దిక్కుమాలిన.. దాష్టిక పాలన అని.. ఈ దాష్టీకాలను ధీటుగా ఎదుర్కొంటామ‌న్నారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. దాడులు, బెదిరింపులతో వైసీపీ నేతలు పాలన చేస్తున్నారని.. వారి దాష్టిక పాలను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నామ‌ని.. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలి.. క్షేత్రస్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామ‌న్నారు.

ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతామ‌ని అన్నారు. వైసీపీ ప్రతిపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడిందని.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారని అన్నారు. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై.. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డు సభ్యులు గెలిచామ‌ని.. అలాగే నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ 1200 స్థానాలలో పోటీ చేసి 177 చోట్ల‌ గెలుపొందిందని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే.. పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నామ‌ని అన్నారు. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ఓటు వేయకపోతే ఫించన్ నిలిపివేస్తాం, రేషన్ కట్ చేయిస్తాం, ఇళ్ల స్థలాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్లతో బెదిరించారని.. ఇతర పార్టీల అభ్యర్ధుల ఆర్థిక మూలలపై దాడులు చేశారని ఆరోపించారు. కొన్నిచోట్ల మంత్రులే స్వయంగా ఎన్నికల ప్రక్రియను నడిపించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ నిలబడిపోయిందని విమ‌ర్శించారు.

పొత్తులో భాగంగా మిత్రపక్షమైన బీజేపీకి కొన్ని స్థానాలు కేటాయించామ‌ని.. దానివల్ల కూడా జనసేనకు కొద్దిగా ఎంపీటీసీ సీట్లు తగ్గాయి. లేకుంటే ఇంకాస్త ఎక్కువ స్థానాలే వచ్చేవని అన్నారు. అన్ని చోట్ల ఎంపీటీసీ అభ్యర్ధులు బరిలో లేకపోవడం జెడ్పీటీసీ అభ్యర్ధులకు ప్రతికూలంగా మారిందని.. అలాగే ఎన్నికల నాటికి జనసేన పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం కూడా చిన్న లోటుగా అనిపించిందని ప‌వ‌న్ అన్నారు.


ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితులు వేరు. ఈ రోజు పరిస్థితులు వేరని ప‌వ‌న్ అన్నారు. ఇప్పుడు గానీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే జనసేన పార్టీ కచ్చితంగా 1500 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలు, 40 నుంచి 80 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకునేదని పరిశీలకులు చెబుతున్నారని అన్నారు. ఇవాళ గెలుపొందిన వారిలో అన్ని కులాల వారు ఉన్నారు. సామాన్యులు గెలుపొందడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సైనికుల‌కు ధన్యవాదాలు తెలిపారు.


Next Story