గొడ్రాలుగా చూస్తున్నారని.. 9 నెలలుగా కడుపుకు గుడ్డలు పెట్టుకుని.. చివరికి..?
రాజమహేంద్రవరంలో కొప్పిశెట్టి సంధ్యారాణి అనే మహిళా కిడ్నాప్ వ్యవహారంలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి.
By Medi Samrat
రాజమహేంద్రవరంలో కొప్పిశెట్టి సంధ్యారాణి అనే మహిళా కిడ్నాప్ వ్యవహారంలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. దేవీపట్నం మండలం ఇందుకూరిపేటకు చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణి 9 నెలల గర్భిణిగా భావించి ఆమె భర్త రాజమహేంద్రవరంలోని జయ కిడ్నీకేర్ ఆసుపత్రికి గురువారం నాడు తీసుకువచ్చాడు. ఆసుపత్రిలో ఆమెకు ఓపీ చీటీ రాశారు. ఇంతలో ఆమె కనిపించకుండా పోయింది. సంధ్యారాణి భర్త పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. సంధ్యారాణి ఫోన్ ఆధారంగా కాకినాడలో ఆమె ఉన్నట్లు తెలుసుకుని, బస్టాండ్లో ఆమెను పట్టుకున్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా తనను ఎవరో కిడ్నాప్ చేశారని, తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని తెలిపింది. ప్రసవం అయిన వెంటనే పిల్లను ఎవరో ఎత్తుకెళ్లిపోయారని, పలు రకాలుగా పోలీసులకు తెలిపింది. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమె గర్భిణి కాదని తేల్చి చెప్పారు.
సదరు మహిళకు పెళ్లి అయి తొమ్మిది సంవత్సరాలు అయ్యింది. పిల్లలు లేరు. తనను గొడ్రాలుగా చూస్తున్నారనే భావనతో కడుపు వచ్చినట్లు నాటకమాడింది. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా బయట భర్తను కూర్చోపెట్టి ఆమె ఒక్కతే డాక్టర్ వద్దకు వెళ్లేది. డాక్టర్ అంతా బావుందని, పురుడు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారని భర్తకు తెలిపేది. దుర్గ భర్త నిజమని నమ్మాడు. ఆమె కడుపు రోజురోజుకీ పెరుగుతున్నట్లు గుడ్డలు పెట్టుకుని నమ్మించింది. చివరికి ఆఖర్లో కిడ్నాప్ నాటకం ఆడి దొరికిపోయింది. ఆమె ఉదంతం తెలిసిన ప్రతి ఒక్కరూ.. అయ్యో పాపం అంటున్నారు.