అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఉత్తర్వులు
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik
అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఉత్తర్వులు
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాల కేటాయించింది. దీంతో ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) ఏర్పాటు అయినట్లు అయింది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్ లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్ , 5కె గేట్స్ క్యాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకు వచ్చింది. భద్రమైన నెట్వర్కింగ్, అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను క్వాంటం వ్యాలీకి ప్రభుత్వం అందించనుంది. చదరపు అడుగుకు రూ.30 కే అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ ను ప్రభుత్వానికి ఐబీఎం సంస్థ కేటాయించనుంది. ప్రభుత్వ సంస్థలు, విద్య పరమైన అంశాలకు గానూ ఈ కంప్యూటింగ్ టైమ్ ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విట్ యూనివర్సిటీ క్యాంపస్ లో రూ.6 కోట్ల వ్యయంతో మరో చిన్న క్వాంటం కంప్యూటర్ను బెంగుళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ క్యూపై ఏఐ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.