ఏపీలో బార్ లైసెన్సుల కోసం నోటిఫికేషన్

Notification for Bar Licenses in AP. ఏపీ ప్రభుత్వం బార్‌ లైసెన్సుల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం.. 2022 బార్‌ లైసెన్సింగ్

By అంజి  Published on  14 July 2022 1:25 PM GMT
ఏపీలో బార్ లైసెన్సుల కోసం నోటిఫికేషన్

ఏపీ ప్రభుత్వం బార్‌ లైసెన్సుల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం.. 2022 బార్‌ లైసెన్సింగ్ విధానం అమలుకు నోటిషికేషన్ జారీ చేసింది. మొత్తం 840 బార్లకు ఈ-ఆక్షన్‌ ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్‌ 1 నుంచి మూడేళ్ల పాటు అమలయ్యేలా బార్‌ లైసెన్స్‌లు జారీ చేసింది. భారత్‌లో తయారైన విదేశీ మద్యం విక్రయానికి అనుమతిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది.

50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.5 లక్షల లైసెన్సు ఫీజు, రూ.15 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జీగా నిర్ణయించింది. 5 లక్షలలోపు జనాభా ఉన్న చోట రూ.35 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.5 లక్షల లైసెన్సు ఫీజు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.5 లక్షల లైసెన్సు ఫీజు, రూ.50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. 3 స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవెరీలకు రూ.50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.5 లక్షల లైసెన్సు ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నోటిఫికేషన్​లో తెలిపింది.

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్ బోర్డులో త్వరలోనే ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమిస్తామని అబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఓ మహిళా డైరెక్టర్ నియమిస్తామని చెప్పారు. ట్రాన్స్‌పరెన్సీ కోసం త్వరలోనే అన్ని వివరాలనూ వెబ్ సైట్​లో ఉంచుతామన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ బార్లను ఏర్పాటు చేస్తామని రజత్ బార్గత అన్నారు. డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లు ఏపీలో విక్రయించేందుకు వీలుగా ఆయా సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు.

మద్యం సరఫరాకు సంబంధించి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 181 ప్రమాణాల్ని పాటిస్తోందని రజత్‌ భార్గవ వెల్లడించారు.

Next Story