సంక్షేమంలో మా ప్రభుత్వం నెంబర్‌ వన్.. ఏపీతో ఏ రాష్ట్రం పోటీపడదు: సీఎం జగన్

పేదలకు సంక్షేమం అందించడంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌సీపీతో పోటీపడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

By అంజి  Published on  9 April 2024 1:16 AM GMT
welfare, CM Jagan, APPolls, YCPGovt, India

సంక్షేమంలో మా ప్రభుత్వం నెంబర్‌ వన్.. ఏపీతో ఏ రాష్ట్రం పోటీపడదు: సీఎం జగన్ 

పేదలకు సంక్షేమం అందించడంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌సీపీతో పోటీపడదని వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాడు అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత తన 'మేమంత సిద్ధం' (మేమంతా సిద్ధంగా ఉన్నాం) ఎన్నికల బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సంక్షేమ పింఛన్ల లబ్ధిదారులతో జరిగిన ఇంటరాక్షన్‌లో ఈ విషయం చెప్పారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో పోటీపడే రాష్ట్రం (ప్రభుత్వం) దేశంలో ఏదీ లేదని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, వివక్ష లేకుండా నెలకు రూ. 2 వేల కోట్లు వెచ్చించి 66 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు.

రాష్ట్రాన్ని బీహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణలతో పోల్చి చూస్తే, వీరంతా ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం నెలకు రూ.1000 చొప్పున 39 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు పంపిణీ చేసేదని, 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేశారని, అయితే ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ రోజు చింతలచెరువు, వినుకొండ, విట్టంరాజుపల్లి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో చేరుకుని రాత్రి బస చేశారు. కడప జిల్లా ఇడుపులుపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 21 రోజుల ఎన్నికల ప్రచార బస్సుయాత్రకు రెడ్డి శ్రీకారం చుట్టారు.

Next Story