ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

By Kalasani Durgapraveen  Published on  27 Oct 2024 8:41 AM GMT
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చిన క్రమంలో వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని స్పష్టం చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేశారు. వీటిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం సమీక్షించారు.

2024 -25 సంవత్సరంలో సిమెంట్ రోడ్లు 3,000 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 500 కిలోమీటర్లు, గోకులాలు 22,525, ఫారం పాండ్లు 25,000, 30,000 ఎకరాలకు సంబంధించి నీటి సంరక్షణ కందకాలు చేపట్టామని... వాటి పనులు పల్లె పండుగ నుంచి మొదలుపెట్టామని తెలిపారు. ఈ పనులు నిర్దేశించిన విధంగా సాగుతున్నాయని వివరించారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేయాలి. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలి. పనులు ఏ దశలో ఉన్నాయో కూడా ప్రజలకు తెలియచేస్తే పారదర్శకత వస్తుంది.

గత పాలకుల మాదిరి పంచాయతీలకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టడం లేదు అని ప్రజలకు తెలుస్తుంది. అదే విధంగా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ద్వారా కూడా ఏ పంచాయతీకి ఎంత నిధులు అందాయో, వాటి ద్వారా చేస్తున్న పనులు ఏమిటో కూడా ప్రజలకు వివరించే ప్రక్రియను కూడా ప్రభావవంతంగా చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభల నిర్వహణ, పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా పనుల ప్రారంభం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయి. అదే విధంగా మనం చేపట్టిన అభివృద్ధి పనులను సైతం నాణ్యంగా పూర్తి చేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి” అన్నారు.


Next Story