రాయలసీమలో ముగిసిన నారా లోకేష్ యువగళం

Nara Lokesh Yuvagalam ended in Rayalaseema. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగిసింది.

By Medi Samrat
Published on : 13 Jun 2023 7:36 PM IST

రాయలసీమలో ముగిసిన నారా లోకేష్ యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగిసింది. రాయలసీమ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన సవాల్ విసిరారు. రాయలసీమలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం రండి అని చాలెంజ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు 49 మంది, ఎంపీలు 8 మంది... నేనొక్కడినే వస్తా... చర్చకు మేం సిద్ధం అని సవాల్ విసిరారు. బద్వేలు క్యాంప్ సైట్ ముందు, టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమకు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ముందు లోకేశ్ సెల్ఫీలు దిగారు. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు కూడా లోకేశ్ సెల్ఫీ దిగారు. "మేము చేసింది ఏంటో చూపించాను. మీరు చేసింది ఏంటో చెప్పే దమ్ము ఉందా? నాలుగేళ్లలో జగన్, వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. గతంలో సీమని అభివృద్ది చేసింది మేమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం" అని లోకేశ్ తెలిపారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 125వ రోజుకు చేరుకుంది. రాయలసీమలో యాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్‌.. మంగళవారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు.


Next Story