మరో 20 ఏళ్ల వరకు ఆయన కలలు కంటూనే ఉండాలి..జగన్పై నాగబాబు సెటైర్లు
జయకేతనం సభలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 March 2025 8:35 PM IST
మరో 20 ఏళ్ల వరకు ఆయన కలలు కంటూనే ఉండాలి..జగన్పై నాగబాబు సెటైర్లు
జయకేతనం సభలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయని అన్నారు. జగన్ వంటి హాస్యనటుడు ఎన్నో కలలు కన్నాడని, మరో 20 ఏళ్ల వరకు కలలు కంటూనే ఉండాలని జగన్ కు నా సలహా అని పేర్కొన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో మొన్నటి ఎన్నికల్లో చూశామని తెలిపారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని నాగబాబు పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలు, జనసైనికులకు రుణపడి ఉన్నామని స్పష్టం చేశారు.
"పవన్ పుట్టేటప్పడు కూడా తల్లికి నొప్పి, బాధ తెలియనివ్వలేదు... ప్రజల కోసం నిలబడే వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ లా గొప్ప వ్యక్తి మాదిరిగా తయారవ్వాలి... లేకుంటే ఆయన అనుచరుడిగానైనా ఉండాలి. మరో రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్. నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినందుకు, ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ సభా ముఖంగా పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
దేవుడు అడిగితేనే వరాలు ఇస్తాడు... అడగకుండానే వరాలు ఇచ్చే వ్యక్తి పవన్ కల్యాణ్. నేను జనసైనికుడ్ని అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. పిఠాపురంలో ఘనవిజయం సాధించే విషయం పవన్ కల్యాణ్ కు ముందే తెలుసు. పిఠాపురంలో పవన్ విజయానికి తానే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. పిఠాపురంలో విజయానికి పవన్, ప్రజలే కారణం" అని నాగబాబు పేర్కొన్నారు.