ఓ మంచి పని కోసం.. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్..!
ఈ నెల 15న తలసేమియా భాదితులకు సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 6 Feb 2025 4:45 PM IST
ఈ నెల 15న విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో తలసేమియా భాదితుల సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలు నారా భువనేశ్వరి, తమన్ మీడియాకు వివరించారు. ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
తమన్ మాట్లాడుతూ.. ఈ షో నేను చేయడం చాలా సంతోషంగా ఉంది. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమం చేయాలి అని అడిగారు. తలసేమియా భాదితులకు సహాయం కోసం అని చెప్పగానే.. నేను వెంటనే ఈ కార్యక్రమానికి వస్తా అని చెప్పాను. వారు నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం నా చేతిలో పెట్టారు.. సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం పగలు, రాత్రి పని చేస్తున్నారు. టికెట్పై పెట్టే ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుందన్నారు.
నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాము. ప్రతి టికెట్పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయి. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారు. తమన్ ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారు. ప్రతి ఒక్కరు తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలి.. సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి. మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు.. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుంది. ప్రతి ఒక్కరు కొనే టికెట్ సమాజ సేవకే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.