ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ఒక గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు టిప్పర్ ట్రక్కును ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 6 గంటల సమయంలో, గమ్యస్థానానికి చేరుకోవడానికి మరో గంట ప్రయాణం మాత్రమే మిగిలి ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షణాల్లో బస్సును మంటలు చుట్టుముట్టడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ ప్రాణ భయంతో బయటకు దూకారు.
ఈ ప్రమాదంలో కణిగిరి మండలం మందదివారిపల్లికి చెందిన 45 ఏళ్ల ఉప్పు రమాదేవి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మంటల నడుమ ఆమె చూపిన మాతృప్రేమ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన కుమారుడు మనోహర్తో కలిసి ప్రయాణిస్తున్న రమాదేవి, బస్సు లోపల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని గమనించారు. మంటల నుంచి తన కుమారుడిని రక్షించుకోవాలనే తపనతో, ఆమె అతడిని కిటికీ గుండా బస్సు బయటకు తోసేసింది. కుమారుడు క్షేమంగా బయటపడగా, దురదృష్టవశాత్తూ రమాదేవి మంటల నుంచి తప్పించుకోలేక బస్సులోనే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. కన్న కొడుకు ప్రాణాల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ తల్లి సాహసం స్థానికులను కలచివేసింది.