రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదని, మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారని, తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయిందన్నారు.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపించారు. ఈ ఏడాదిన్నరలో తనను ఐదుసార్లు గర్భవతిని చేశారని, అబార్షన్ కూడా చేయించారని బయటపెట్టింది. ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్లయింది. మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఉద్యోగ రీత్యా భర్త హైదరాబాద్లో ఉంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా, అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న తన భర్తకు విడాకులు ఇవ్వాలని చెప్పడంతో తమ మధ్య విభేదాలు తలెత్తాయని, తన మూడేళ్ల బిడ్డ ప్రాణం తీస్తానని హెచ్చరించారని కన్నీటి పర్యంతం అయ్యింది.