మహానాడును అడ్డుకునేందుకే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు : భ‌ర్త అరెస్ట్‌పై ఎమ్మెల్యే భ‌వానీ

MLA Adireddy Bhavani Sensational Comments On YCP Govt. రాజమండ్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు

By Medi Samrat  Published on  30 April 2023 1:15 PM GMT
మహానాడును అడ్డుకునేందుకే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు : భ‌ర్త అరెస్ట్‌పై ఎమ్మెల్యే భ‌వానీ

రాజమండ్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను చిట్ ఫండ్ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్పందించారు. తన భర్త, మామలను ఎందుకు అరెస్ట్ చేశారో స్పష్టమైన కారణాలు తెలియవని అన్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడును అడ్డుకునేందుకే తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. తమపై కక్షతోనే అక్రమ అరెస్ట్ లకు పాల్పడ్డారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చిట్ ఫండ్ సంస్థలో రెండ్రోజుల పాటు తనిఖీలు చేశారని, తమపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని వివరించారు. తాము పార్టీ కోసం నిలబడాలని నిర్ణయించుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామని తెలిపారు. ఏదో ఒక అంశం పట్టుకుని ఇలాంటి కేసులు పెడుతుంటారని, కానీ న్యాయస్థానాలకు వెళితే ఈ కేసులు నిలబడవని ఆదిరెడ్డి భవానీ అన్నారు. టీడీపీ వాళ్లను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తాము 35 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నామని, రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ తమ వాళ్లు ఈ వ్యాపారం చేశారని, ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. రోజు రోజుకు వైసీపీ వేధింపులు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రత్యర్థులను ఓడించడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని అన్నారు. కేసులు పెట్టి లొంగదీసుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.


Next Story