అమరావతి: రాష్ట్రంలో నేతన్నలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత శుభవార్త చెప్పారు. 2025-26 ఏడాది నేతన్నలకు సంబంధించిన త్రిఫ్ట్ ఫండ్ నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. కాగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలో 5,726 నేతన్నలకు లబ్ధి చేకూరనుందని మంత్రి సవిత వెల్లడించారు.
మరో వైపు సంక్రాంతికి ముందు రూ.5 కోట్ల ఆప్కో బకాయిలు చెల్లించామని మంత్రి సవిత గుర్తు చేశారు. అటు డిసెంబర్లోనూ రూ.2.42 కోట్లు బకాయిలు ఆప్కో చెల్లించిందని, 2 నెలల వ్యవధిలోనే రూ.9 కోట్లకు పైగా నిధులను నేతన్నలకు అందజేసినట్లు మంత్రి సవిత తెలియజేశారు. చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు.