నారా లోకేష్ కు థ్యాంక్స్ చెప్పిన మంత్రి రోజా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఏపీ మంత్రి రోజా థ్యాంక్స్ చెప్పారు.

By Medi Samrat  Published on  6 Oct 2023 2:51 PM GMT
నారా లోకేష్ కు థ్యాంక్స్ చెప్పిన మంత్రి రోజా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఏపీ మంత్రి రోజా థ్యాంక్స్ చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అన్యాయాన్ని చెబుతామని అంటున్నారని, ఇందుకు ఆయనకు తాము ధన్యవాదాలు చెబుతున్నామని రోజా అన్నారు. 'చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు, చంద్రబాబు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి వైసీపీ వెళ్ళి తెలియజేస్తుంటే, మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతామని చెప్పినందుకు థాంక్యూ.. లోకేశ్. ఇప్పటికైనా మీ తండ్రి చేసిన తప్పుల్ని, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడమే కాదు ప్రజల్ని క్షమించమని అడిగితే ఇంకా బాగుంటుంది..!!' అంటూ రోజా ట్వీట్ చేశారు.

శుక్రవారం రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామనే ఉద్దేశ్యంతో మాట్లాడబోయి, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ మాట్లాడారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ను రోజా ట్వీట్ చేస్తూ, లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే ముందు రూ.3 వేల కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం అన్నారని నారా లోకేష్ మీడియాతో అన్నారు. ఆ తర్వాత రూ.371 కోట్లు అని వైసీపీ నేతలు మాట మార్చారన్నారు.. ఇక నిన్న కోర్టులో రూ.27 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారన్నారు. చంద్రబాబు ప్రజల తరఫున పోరాడుతున్నారన్న కారణంతోనే ఆయనను రిమాండ్ కు పంపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 ఏళ్లు విపక్షనేతగా... నిరంతరం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును తప్పుడు కేసులతో జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారని ఆరోపించారు నారా లోకేష్.

Next Story