'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
By అంజి
'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
విజయవాడ: అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇప్పటివరకు 67,27,000 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.8,745 కోట్లు జమ చేశామని చెప్పారు. "ఒకటవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో చేరిన తర్వాత వారి తల్లుల ఖాతాల్లో కూడా డబ్బులు జమం చేస్తాం" అని చెప్పారు.
విద్యార్థులకు తల్లి లేని పక్షంలో, వారి తండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయబడుతుందని మంత్రి లోకేష్ చెప్పారు. కొంతమంది విద్యార్థులకు డబ్బు అందకపోతే, శనివారం నాటికి అది పూర్తవుతుంది. జూన్ 26 వరకు డబ్బు చెల్లించడానికి సమయం ఉంటుందని ఆయన అన్నారు. కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందకపోతే, వారి తల్లుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా లేకపోవడమో లేదా మొత్తాన్ని జమ చేయడంలో మరేదైనా సమస్య ఉండడమో జరిగి ఉండవచ్చు. తల్లులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు.
ఖాతాల్లో డబ్బులు జమ కానప్పుడు మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. జూన్ 16 నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవుతాయని లోకేష్ అన్నారు. మెరుగైన నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఇచ్చిన మొత్తం రూ. 15,000లో రూ. 2000 అతని (లోకేశ్) బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందని ప్రతిపక్షం చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ, మంత్రి రుజువు చూపించాలని లేదా అభియోగాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.