అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ జగన్ తన పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. అందినకాడికి అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు నారా లోకేష్ రాష్ట్ర అప్పులు, వడ్డీకి సంబంధించిన రెండు ఫొటోలను ట్వీట్ చేశారు.
58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా... జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి... అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరిందని తెలిపారు. అంటే అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11వేల కోట్లు అధికం అని అన్నారు. జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.