అమరావతి: ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై లోకేష్ సమీక్ష నిర్వహించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డీఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్ పై సమావేశంలో చర్చించారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్ర పన్నారని నారా లోకేష్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని, అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని లోకేష్ ఆదేశించారు. నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.