పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని
Minister Kodali Nani Fire On Pawan Kalyan. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్రంలో వేడెక్కిస్తోంది.
By Medi Samrat
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్రంలో వేడెక్కిస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు కలిసి స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి మొదలు ఉద్యమం మొదలు పెట్టాయి. మరోవైపు ఇదే అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ, టీడీపీ వామపక్షాల నేతలు పోరుబాట పట్టారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్రంలోని పెద్దలను కలుస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్పై చర్చిస్తున్నారు. ప్రైవేటీకరణ వద్దంటూ హోంశాఖ మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులకు వినతి పత్రం ఇచ్చారు.
అయితే పవన్ ఢిల్లీ టూర్పై మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ టూర్ను ఎద్దేవా చేశారు. మరో వైపు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరినీ పవన్ దగ్గరకు పంపిస్తానని, దమ్ముంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సవాల్ చేశారు. జనసేన మిత్రపక్షమైన బీజేపీతో కలిసి విశాఖ స్టీల్ప్లాంట్ వ్యవహారంపై స్పందించాలని అన్నారు. అంతేకాదు దీనిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని టీడీపీ, జనసేనలు చూస్తున్నాయని, ఇదే మన రాష్ట్రానికి పట్టిన దౌర్బాగ్యం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అటూ వైసీపీ అన్ని విధాల పోరాటం చేస్తోందని కొడాలి నాని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీని పవన్ కల్యాణ్, చంద్రబాబులు కలిసి నిలదీయాలని సూచించారు. ఇక తనతో పాటు పోరాటంలో వారిద్దరూ నడుస్తానంటే తానే దగ్గరుండి పోరాటం చేస్తానంటూ కామెంట్స్ చేశారు.