అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపై ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు. ఈ స్కామ్లో నెలకు రూ. 100 కోట్ల ముడుపులు అందేవని, దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా నగదు అక్రమంగా చేతులు మారిందని ఈడీ (ED) గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి వంటి నిందితులకు చెందిన రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిందని వివరించారు.
2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన 'మద్య నిషేధం' వాగ్దానం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనా అని లోకేష్ ప్రశ్నించారు. ఒకవైపు మద్యపానాన్ని అరికడతామని చెబుతూనే, మరోవైపు అక్రమ మద్యం ద్వారా వేలాది కుటుంబాలను నాశనం చేసి తన అనుచరుల జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఈ రూ. 3,500 కోట్ల మనీలాండరింగ్పై ఏపీ ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని, మౌనం వీడాలని లోకేష్ డిమాండ్ చేశారు.