ఏపీ మందుబాబులకు బ్యాడ్న్యూస్.. లిక్కర్ ధరలు భారీగా పెంపు
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు 15% పెరిగాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 11 Feb 2025 6:46 AM IST
ఏపీ మందుబాబులకు బ్యాడ్న్యూస్.. లిక్కర్ ధరలు భారీగా పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు 15% పెరిగాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 99 ధర గల బీర్ బ్రాండ్లు మినహా. ఈ పెంపును అన్ని బ్రాండ్లకు విస్తరించాలని నిర్ణయించారు. దీని ప్రకారం భారతీయ, విదేశీ తయారీ మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (AERT) విధించబడుతుంది. మార్జిన్ తక్కువ వస్తోందని లైసెన్సీలు గగ్గోలు పెట్టడంతో వారికిచ్చే మార్జిన్ పెంపునకు ఇటీవల కేబినెట్లో ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ పన్నుల్లో మార్పులు తీసుకొచ్చింది. మార్జిన్ సవరణ కోసం వినియోగదారులపై స్వల్పంగా అదనపు భారం వేయాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అప్పటి అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించిన మద్యం ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా మద్యం ధరలను పెంచింది.
మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్పై రూ.10 పెంచినట్టు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.