19 మంది సజీవ దహనానికి కారణమైన బస్సు ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పడంతో ఉలిందకొండ పోలీసులు మృతుడు శివశంకర్పై వివిధ బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గురువారం రాత్రి తానూ, శివశంకర్ బైక్పై వెళుతున్నాం. బైక్ను శివశంకర్ నడుపుతున్నాడు. అతని నిర్లక్ష్యం కారణంగా బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో మేమిద్దరం కిందపడిపోయాం. ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. నేను అతని మృతదేహాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేస్తుండగా, మరో వాహనం మా బైక్ను ఢీకొని రోడ్డు మధ్యలోకి లాక్కెళ్లింది. అదే సమయంలో వేగంగా వచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్ను ఈడ్చుకెళ్లింది. దీనివల్లే బస్సులో మంటలు చెలరేగాయని ఎర్రిస్వామి స్పష్టం చేశాడు. కర్నూలు ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL) నివేదిక ఇప్పటికే అందించింది. మృతుడు శివశంకర్ రక్త నమూనాలను పరీక్షించగా, అతని శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు నివేదిక నిర్ధారించింది. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో బైక్ నడిపినట్లు స్పష్టం చేసింది.