పిరికిపందల్లా అతికించిపోయారు.. పోస్టర్లపై కోమటిరెడ్డి పైర్‌

Komatireddy Rajagopal Reddy Press Meet. చౌటుప్పల్, నారాయణ పురం మండల కేంద్రాల్లో ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని

By Medi Samrat  Published on  13 Aug 2022 1:45 PM GMT
పిరికిపందల్లా అతికించిపోయారు.. పోస్టర్లపై కోమటిరెడ్డి పైర్‌

చౌటుప్పల్, నారాయణ పురం మండల కేంద్రాల్లో ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాత్రికి రాత్రి ఆటోల్లో పిరికిపందల్లా వచ్చి అతికించిపోయారు.. రాజగోపాల్ అమ్ముడు పోయారంటూ అందులో ఉంది.. నేనంటే గిట్టనివాళ్లే చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డబ్బులు, పదవీకోసం అయితే 12 మంది‌ ఎమ్మెల్యేలు పోయిన నాడే పార్టీ మారేవాడినని.. పార్టీలో అవమానాలు ఎదురైనా పోరాటం చేశాన‌ని అన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయమని, రోడ్లు నిర్మించాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బెల్ట్ షాపులు తొలగించాలని, చౌటుప్పల్ లో‌ కాలుష్యం పై పోరాటం చేస్తూనే ఉన్నాన‌ని తెలిపారు.

తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో అవినీతిపై పోరాటం చేశాన‌ని.. నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తాడా అని ప్ర‌శ్నించారు. ఒక పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించిన వ్యక్తులను పట్టించుకోలేదని.. అవినీతి, కుటుంబ పాలన పోవాలనే పార్టీ మారుతున్నాన‌ని తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన‌పడిందని అన్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజీనామా చేస్తే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

గట్టుప్పల్ మండ‌లం మూడున్నరేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు.. అమిత్ షాని కలవగానే మండలం ఇచ్చార‌ని అన్నారు. నా రాజీనామాతో తెలంగాణా వ్యాప్తంగా పది లక్షల పించన్లు రాలేదా అని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ అడిగారు. నా రాజీనామా వల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయని అన్నారు.

మునుగోడు ప్రజలు నా వెంట ఉన్నారనే ఇలాంటి పని చేస్తున్నారని.. నాకు వస్తున్న ఆదరణ చూసే ఇలాంటి పనులు చేస్తున్నారని పోస్ట‌ర్లు అంటించిన వారిపై ఫైర్ అయ్యారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా పోలేదన్నారు. అలాంటిది ఇప్పుడు కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతానా అని అడిగారు. నిజాయితీగా నైతిక విలువలకు కట్టుబడి బీజేపీలో‌ చేరుతున్నాన‌ని తెలిపారు.

కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్నానని రుజువు చేయమని‌ గతంలోనే సవాల్ విసిరినా ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. నేను తప్పు చేయలేదని గుడిలో ప్రమాణం చేస్తానని అన్నాను.. దొంగచాటున పోస్టర్లు అంటించడాన్ని మునుగోడు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రేపు గెలిచేది నేను కాదు.. మునుగోడు ప్రజలని అన్నారు. మునుగోడు తీర్పుతో.. తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని అన్నారు.

అమ్ముడుపోయానని మీ దగ్గర రుజువులు ఉంటే 24 గంటల్లో తీసుకురావాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాన‌ని స‌వాల్ విసిరారు. ఈనెల 21 న మధ్యాహ్నం మూడు గంటలకు అమిత్ షా మునుగోడుకు వస్తున్నారు. ఈ ధర్మయుద్ధానికి అమిత్ షా శంఖారావం పూరించబోతున్నారని అన్నారు. మూడు లక్షల మందితో బహిరంగ సభ ఉండబోతోందని తెలిపారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ బాగు కోరుకునే వారంతా రావాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని‌ చాలాసార్లు చెప్పినట్లు గుర్తుచేశారు.


Next Story