తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య చెలరేగిన వివాదం చివరికి క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరై, సుమారు నాలుగు గంటల పాటు కమిటీ సభ్యులకు తన వాదనను లిఖితపూర్వకంగా వివరించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు
గత ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం తన నుంచి కేశినేని చిన్ని రూ.5 కోట్లు డిమాండ్ చేసి తీసుకున్నారంటూ కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను కూడా ఆయన తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశారు. కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. తనపై ఎవరు పడితే వారు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని, తన క్యారెక్టర్ వేరని ఘాటుగా సమాధానమిచ్చారు. 12 నెలల పాటు తనను దేవుడని పొగిడిన కొలికపూడి, ఇప్పుడు దెయ్యం అని ఎందుకు అంటున్నారో ఆయనే చెప్పాలన్నారు.