అది సీఎం జగన్ కలల ప్రాజెక్ట్.. పూర్తి సహకారం అందించండి
Kadapa Steel Is Jagan Dream Project. ఓడిశా రాష్ట్రంలోని కోణార్క్ లో కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్, పరిశ్రమల మంత్రులు
By Medi Samrat Published on 25 Feb 2022 9:01 PM IST
ఓడిశా రాష్ట్రంలోని కోణార్క్ లో కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్, పరిశ్రమల మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన కాన్ఫెరెన్స్ లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఏపీఎండిసి వీసీ&ఎండీ, డీజీఎం వీజీ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం గనులు, పరిశ్రమల విషయంలో తీసుకుంటున్న ప్రగతిశీల విధానాలపై కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖకు తన ప్రజంటేషన్ లో వివరించారు. సీఎం వైఎస్ జగన్ కలల ప్రాజెక్ట్ గా ఉన్న కడప ఉక్కు కర్మాగారంకు అవసరమైన చేయూతను అందించాలని కోరారు. కడప ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ గా ఉందని.. సీఎం జగన్ ఈ కర్మాగారంను ప్రారంభించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో అపారమైన ఇనుపఖనిజం వనరులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో కడప ఉక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఒక వరంగా మారుతుందని అన్నారు. దేశంలోనే సుమారు 13 శాతం మ్యాగ్నటైట్ ఇనుప ఖనిజ నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. దాదాపుగా 110 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. అలాగే మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్ గ్రేడ్ లను కూడా బెనిఫికేషన్ చేసి, వాటిని ఉక్కు కర్మాగారంకు ముడి ఖనిజంగా వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలించాలని కోరారు. అనంతపురంలోని ఇనుపఖనిజం లీజులను ఏపీఎండీసీ రిజర్వు చేయాలని.. ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఏపీఎండీసీని బలోపేతంకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు.
గనులకు అనుమతులు ఇచ్చే సందర్భంలో కనీసం అయిదు నుంచి పది సంవత్సరాల పాటు కాలయాపన జరుగుతోందని.. దాని ఫలితంగా అనుకున్న లక్ష్యం ప్రకారం.. మైనింగ్ కార్యక్రమాలు జరగడం లేదని అన్నారు. ఈ అనవసరపు జాప్యంను నివారించేందుకు కేంద్ర గనులు, పర్యావరణ మంత్రులు, రాష్ట్రానికి చెందిన ప్రతినిధులతో ఒక కోర్ కమిటీని వేసి, అనుమతుల జారీలో కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.