'వార్ 2' సినిమా విడుదల సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హీరో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనంతపురంలో సినిమాను ఆడనివ్వనని హెచ్చరించారని ఆరోపిస్తూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆడియోను ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడు లీక్ చేయగా, ఎమ్మెల్యేపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలిపి, ఆయన ఫ్లెక్సీలను చించివేశారు. ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే ఎమ్మెల్యే వర్గీయుల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ధనుంజయ నాయుడు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆడియో క్లిప్ను తానే బయటపెట్టానని చెబుతున్న ధనుంజయ ఎమ్మెల్యే ప్రసాద్ వర్గీయులు తన భార్యకు, సోదరుడికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ ఆడియో నకిలీదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వల్ల తనకు ప్రాణానికి హాని ఉందని, పార్టీ కోసం కష్టపడి జైలుకు కూడా వెళ్లానని ధనుంజయ వాపోయారు.