యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
By అంజి
యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యోగాంధ్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యోగా సాధకులు బీచ్ రోడ్డుకు చేరుకున్నారు. కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద మోదీ యోగాసనాలు వేస్తారు. 15 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా సాధన చేస్తారు.
భారతీయులందరికీ ప్రధాని మోదీ 11వ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మందికి జీవన విధానాన్ని యోగా మార్చేయడం చూస్తే గర్వంగా ఉందన్నారు. యోగా ప్రపంచ ఎల్లలను చెరిపివేసిందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్కు అభినందనలు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంతో సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేసి చూపించారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
11వ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో జరుపుకుంటున్నారని, యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. రోజూ గంట సేపు యోగా చేస్తే ఎన్నో లాభాలుంటాయని, యోగాను జీవన విధానంగా మార్చుకుందామని అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. యోగా విశిష్టతను, గొప్పతనాన్ని రుగ్వేదంలో చెబితే దానిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మాత్రం ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. యోగా సాధకులు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనే దానికి ఆయనో ఉదాహరణ అని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతీయులకు దక్కిన గౌరవం అని పవన్ వ్యాఖ్యానించారు.