'యోగా డే' వేడుకలు.. నేడు మధ్యాహ్నం వరకే పాఠశాలలు
నేడు రాష్ట్రంలో పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
By అంజి
'యోగా డే' వేడుకలు.. నేడు మధ్యాహ్నం వరకే పాఠశాలలు
అమరావతి: నేడు రాష్ట్రంలో పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల 8 గంటల వరకు విద్యార్థులతో యోగా చేయిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత సెలవు ఇస్తారు. విశాఖలో అన్ని స్కూల్స్కు ఈ రోజు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.
అటు విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహిస్తున్న 'యోగాంధ్ర' కార్యక్రమానికి యోగా సాధకులు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఔత్సాహికులు బీచ్ రోడ్డుకు తరలి వస్తున్నారు. ఇప్పటికే యోగాంధ్రలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు 26 కి.మీ పొడవైన కారిడార్లో జరిగే యోగాంధ్ర కార్యక్రమం అతిపెద్ద యోగా సమావేశాలలో ఒకటిగా భావిస్తున్నారు. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా లక్ష కేంద్రాల్లో యోగా సెషన్లను ప్లాన్ చేశారు.
విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. "25,000 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తారు" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నారు. శనివారం ఉదయం 6.30 నుండి ఉదయం 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమం అంతర్జాతీయ గుర్తింపు పొందడం మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్తో సహా రికార్డులను బద్దలు కొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.