ఆ పిటీషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై

By M.S.R  Published on  29 Sep 2023 2:01 PM GMT
ఆ పిటీషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఈనెల 27న విచారణ జరిపింది. తొలుత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 29కు వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ హైకోర్టు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ఉన్నాయని ఏజీ శ్రీరాం వాదించారు. లింగమనేని భూముల పక్కనుంచి రోడ్ వెళ్లేలా అలైన్‌మెంట్ మార్పులు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలైన్‌మెంట్ మార్పు అనంతరం లింగమనేని భూముల విలువ భారీగా పెరిగిందని.. లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూ అక్రమాలకు పాల్పడ్డాయని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.

Next Story