అమరావతి: కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్నూ జైలులో పెడతామంటే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు కదా? జగన్ తప్పులు చేసినట్టు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే చర్యలు తీసుకోవాలని అన్నారు. తప్పుచేసిన వారిని వదిలిపెట్టనని, కొన్ని గంజాయ్ బ్యాచ్లు నేరాలు చేసి ప్రభుత్వంపై నెడుతున్నాయని అన్నారు. మంత్రులు జాగ్రత్తగా ఉండి, మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిన్న సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా.. ‘జగన్ తప్పు చేశాడు కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించగా.. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ సీఎం సూచించారు. గతంలో నేరస్థులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారని.. అయితే ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది మంత్రులు బాగా పనిచేశారని.. ఇంకా కష్టపడాలని.. ఈ ఏడాది ఏం చేశారనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు. రాబోయే ఏడాదికి ప్లాన్ చేసుకోవాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశామని, కానీ ఏం చేసినా జనాన్ని ఎంపవర్ చేయాలని మంత్రులకు తెలిపారు.