అమరావతి: రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవంలోకి మారినరోజే ఆ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది. వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని తెలిపింది. తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని 2021లో గుంటూరు జిల్లాకు చెందిన చింతాడ ఆనంద్ అనే పాస్టర్ చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రామిరెడ్డి సహా మరో ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఈ కేసు గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణలో ఉంది. ఈ క్రమంలో దీన్ని సవాలు చేస్తూ రామిరెడ్డి సహా ఐదుగురు హైకోర్టుకు వెళ్లగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫిర్యాదుదారుడు పదేళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నాడని.. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని పిటిషనర్ల తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది.. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది.. ఈ మేరకు అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసింది.