అది నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తాం : గుడివాడ అమర్ నాథ్

వైజాగ్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 17 Oct 2025 8:30 PM IST

అది నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తాం : గుడివాడ అమర్ నాథ్

వైజాగ్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. కానీ ఆ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 1.88 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, మన ఒక్క రాష్ట్రంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. అయినా ఉద్యోగాల గురించి చెప్పాల్సింది లోకేశ్‌, టీడీపీ నేతలు కాదని అన్నారు. ఈ విషయంపై గూగుల్‌నే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలపై గూగుల్‌తోనే చెప్పించాలని గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. కనీసం ఆ సంస్థతో అధికారికంగా ప్రెస్‌నోట్‌ అయినా రిలీజ్‌ చేయించాలన్నారు. నిజంగా రెండు లక్షల ఉద్యోగాలు రావడం నిజమని తేలితే తామే సన్మానం చేస్తామన్నారు. అసలు గూగుల్‌తో సమాధానం చెప్పించడానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

తనను గుడ్డు అంటే.. నారా లోకేష్ ను పప్పు అంటానని అమర్ నాథ్ విమర్శించారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేశ్‌ను పప్పు అన్నా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. మాయమాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయవద్దన్నారు. నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావని.. నేను మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామో కూర్చుని రాసుకుందామా అని నారా లోకేశ్‌ను గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. అమరావతి రోడ్లు తప్ప మంత్రిగా రాష్ట్రానికి నువ్వు ఏం చేశావని ఎద్దేవా చేశారు. నేను వెటకారంగా మాట్లాడటం మొదలు పెడితే లోకేశ్‌ భరించలేరని అన్నారు.

Next Story