రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు

రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.

By -  Knakam Karthik
Published on : 15 Oct 2025 3:57 PM IST

Andrapradesh, liquor, AP Government, AP Excise Suraksha App, Excise Department

రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు

అమరావతి: రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన, నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా పలు నిబంధనలు ఎక్సైజ్ శాఖ అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి మద్యం బాటిల్‌ను క్యూర్ ఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం, బార్ యజమానులు అమ్మాలని నిబంధన పెట్టింది. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ను తప్పని సరిగా స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది. ప్రతి దుకాణం, బార్‌ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. "ఇక్కడ విక్రయించే మద్యం QR కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనదని ధృవీకరించాం" అని బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

వినియోగదారులకు విక్రయించే ముందు, అమ్ముతున్న ప్రతి మద్యం బాటిల్ యొక్క ప్రామాణికతను ధృవీకరించాలని, మద్యం బాటిల్‌పై సీల్, క్యాప్, హోలోగ్రామ్ స్ధితి, ప్రామాణికతను తనిఖీ చేయాలని, ప్రతి దుకాణం, బార్‌లో "డైలీ లిక్కర్ జెన్యునైనెస్ వెరిఫికేషన్ రిజిస్టర్” అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నంబర్, రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. QR తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ ఫలితాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించింది.

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా రియల్-టైమ్ డేటాలో ప్రదర్శించాలని ఆదేశించింది. ఎక్సైజ్ సిబ్బంది ప్రతి రోజూ మద్యం దుకాణం, బార్లలో ర్యాండం విధానంలో తనిఖీలు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. తనిఖీలు వివరాలను దుకాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేసి ఎక్సైజ్ అధికారి రోజూ సంతకం చేయాలని ఆదేశించింది. డిపో నుండి మద్యం స్టాక్ అందిన తర్వాత, ప్రతి షాప్, బార్ లో ప్రతి సరుకులోని కనీసం 5% బాటిళ్లను స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌పై లైసెన్స్‌దారు సంతకం చేయాలని నిబంధన తీసుకువచ్చింది. సర్టిఫికెట్‌ను డైలీ లిక్కర్ జెన్యూన్‌నెస్ వెరిఫికేషన్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని, తనిఖీల్లో నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అధికారి లేదా లైసెన్సు దారుడు నకిలీ మద్యం పై ఫిర్యాదు చేయకపోతే నకిలీ మద్యానికి సహకరించడం , నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించాలి. నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్సు రద్దు చేయడం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నకిలీ మద్యం పై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు పనిచేసే పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని సూచించింది. కంట్రోల్ రూం, వాట్సప్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలి, ఫిర్యాదులను 24 గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలి.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ ఎండీ, ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story