రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది
By Knakam Karthik
రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి అధ్యయనం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో సభ్యులుగా ఏడుగురు మంత్రులను నియమించింది. వీరిలో అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. దీనికి కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉపసంఘంలోని మంత్రులు పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని తెలిపింది.
జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని, జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది. సరిహద్దులు, పేర్లపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.