పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్లు పంపిణీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
By - Medi Samrat |
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో శనివారం పండుగ వాతావరణం లో జరిగిన నిర్వాసితుల సభలో రూ. 1000 కోట్లు పంపిణీ చేశారు. నిర్వాసితులకు భూసేకరణ, మరియు పునరావాసం పరిహారం నగదును బ్యాంకు ఖాతాలలో జమ చేసే కార్యక్రమం పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు నిర్వాసితులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడారు. చారిత్రక పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి త్యాధనులైన నిర్వాసితులందరికీ పరిహారం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు కొండంత అండగా నిలిచిన పవన్ కళ్యాణ్, వీరికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతునిచ్చిన ప్రధానమంత్రి మోదికి మనమంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని పిలుపునిచ్చారు. నాడు నేడు కూడా చంద్రన్న హయాంలోనే నిర్వాసితులకు న్యాయం జరిగిందని రామానాయుడు స్పష్టం చేశారు. అందులో భాగంగానే 2016 లో రూ. 700 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన సంగతిని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరిలో 900 కోట్లు ఇచ్చిన సంగతి మీకు తెలుసు అన్నారు. ఇప్పుడు రెండోసారి 1000 కోట్లు మీ ఖాతాల్లో జమవుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో కూడా నిర్వాసితులందరినీ కూటమి ప్రభుత్వం నిండు మనసుతో ఆదరిస్తుందన్నారు. మీకు అండగా నిలబడుతుందన్నారు.
గత 5ఏళ్ళ వైసిపి పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. నిర్వాసితులందరినీ గాలికి వదిలేశారు. ఆశ్రయం కోల్పోయిన మీరందరూ వరదల సమయంలో పడ్డ అష్ట కష్టాలు మా అందరికీ తెలుసు అన్నారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే.. 2019- 24 మధ్య వైకాపా అరాచక ప్రభుత్వం మూడు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది అన్నారు. పోలవరం నిర్మాణ ప్రగతిని పాతికేళ్ళు వెనక్కి నెట్టేసింది అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణం గాడిలో పెట్టడంతో పాటు, ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులైన మీ అందరికీ అండగా నిలబడ్డ సంగతి గుర్తించాలన్నారు. అన్యాయం చేసిన వైకాపా పార్టీని , జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం మీరు గుర్తు ఎరగాలన్నారు.
నాడు జగన్ పాలనలో నిర్వాసితులు తమను తెలంగాణాలో కలిపేయమని రోడ్డెక్కి అందోళన చేసిన పరిస్దితిని మంత్రి గుర్తు చేశారు. ఐదేళ్ల వైసిపి పాలనలో పునరావాస కాలనీల నిర్మాణానికి ఒక్క బస్తా సిమెంట్ పని గానీ, నిర్వాసితులకు ఒక్క రూపాయి నష్టపరిహాం గానీ ఇవ్వలేదని మంత్రి దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన రూ.3385 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను కూడా, ప్రాజెక్టు నిర్మాణానికి గానీ, నిర్వాసితులకు గానీ, అందించకుండా దారి మళ్లించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఫేజ్ 1 కింద 41.15 మీటర్ల కాంటూరులో, 2026 జూన్ నాటికి సహాయ, పునరావాసం,ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పునరావాసం, కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ. 739 కోట్లతో ఇటీవలే టెండర్లు పూర్తయ్యాయని ప్రకటించారు. ప్రస్తుతం 75 నిర్వాసిత కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయన్నారు. సమాంతరంగా మౌలిక సదుపాయాలు కూడా కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.
తొలిదశ ఆర్అండ్ఆర్ 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భూసేకరణ, పరిహారం విషయం లో దళారుల పాత్ర ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ఆరు నెలలు ముందే ఫేజ్ -2 నిర్వాసితుల పరిహారం తదితర సమస్యలు పరిష్కరిస్తామని రామానాయుడు స్పష్టం చేశారు.