విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం
గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
By - Knakam Karthik |
విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం
భారతదేశంలో ఏఐ విప్లవానికి నాంది పలుకుతూ, గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ వచ్చే ఐదు సంవత్సరాల్లో (2026–2030) దాదాపు 15 బిలియన్ డాలర్లు (సుమారు ₹1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇది గూగుల్కి భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద పెట్టుబడి.
ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో ఈ చారిత్రాత్మక ప్రకటన జరిగింది. ఈ వేడుకకు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కూరియన్ తదితరులు హాజరయ్యారు.
విశాఖ ఎఐ హబ్లో గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యంతో పాటు భారీ డేటా సెంటర్, అంతర్జాతీయ సముద్ర అంతర్గత కేబుల్ గేట్వే, శక్తివంతమైన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటవుతున్నాయి. ఈ హబ్ ద్వారా గూగుల్ తన పూర్తి ఎఐ టెక్నాలజీ స్టాక్ను భారతదేశానికి అందిస్తూ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన వృద్ధికి దోహదం చేయనుంది.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా గూగుల్ అదానీకానెక్స్, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించనుంది. అలాగే విశాఖ తీరానికి కొత్త అంతర్జాతీయ సబ్సీ కేబుల్లు చేరతాయి. ఇది భారత్ తూర్పు తీరాన్ని ప్రపంచ డిజిటల్ నెట్వర్క్లో కీలక హబ్గా మార్చనుంది. పరిశుభ్ర శక్తి వినియోగానికి కట్టుబడి ఉన్న గూగుల్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేయనుంది.