ఏపీ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశం గురించి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి స్పందించారు. పీసీపీ చీఫ్ మార్పుపై ఎలాంటి అనుమానాలు వద్దని, ప్రస్తుత పీసీసీ చీఫ్ షర్మిలపై పార్టీ అధిష్ఠానానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. షర్మిల వర్కింగ్ స్టైల్ షర్మిలదేనని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని.. అయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శించారు.
2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని పీవోకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందని ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. రాజా హరిసింగ్ సమయంలోనే శ్రీనగర్ కు పాక్ దళాలు వచ్చాయని, అప్పుడు నెహ్రూ సహాయాన్ని హరిసింగ్ కోరారని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆదేశం మేరకే ఎల్వోసీ ఏర్పాటయిందని తెలిపారు.