గుంటూరు: గత కొన్ని రోజులుగా వరుస కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పోలీసులతో వాగ్వాదానికి దిగడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అంబటిని విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఆయన రేపు (గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు.