సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By - Knakam Karthik |
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న వైఎస్ జగన్ కోర్టుకు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో వైఎస్ జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జగన్ జైలుకు కూడా వెళ్లారు. అయితే జగన్కు బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు పలు షరతులు విధించింది. కోర్టు విధించిన షరతుల కారణంగా ఆయన విదేశీ పర్యటలనకు వెళ్లే సమయంలో సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలోనే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలని అనుకున్నప్పుడు కోర్టు అనుమతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే యూరప్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరగా, “తిరిగి వచ్చాక నవంబర్ 14న వ్యక్తిగతంగా హాజరుకావాలి" అని కోర్టు షరతు పెట్టింది. జగన్ యూరప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీ లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరైతే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అవసరమని, ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ కోర్టు తాను హాజరుకావాలని కోరితే... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని జగన్ అభ్యర్థించారు.
అయితే జగన్ మెమోపై నిర్ణయం తీసుకునేందుకు సీబీఐని కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ... జగన్ కోరిన మినహాయింపును వ్యతిరేకించింది. విదేశీ పర్యటన సమయంలో జగన్ సరైన కాంటాక్ట్ నంబర్ను అందించకుండా షరతులను ఉల్లంఘించారని కూడా సీబీఐ ఆరోపించింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు జగన్ హాజరుకావాల్సి ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. నవంబర్ 14లోపు కాకుండా.. మరికొద్ది రోజులు సమయం జగన్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు. దీంతో నవంబర్ 21న లేదా అంతకు ముందు జగన కోర్టు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో జగన్ కోర్టుకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు .