కడప రిమ్స్ ఆసుపత్రికి వైఎస్ జగన్..

Former Chief Minister YS Jagan reached Rims Hospital

By Medi Samrat
Published on : 6 July 2024 4:40 PM IST

కడప రిమ్స్ ఆసుపత్రికి వైఎస్ జగన్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపకు వెళ్లారు. కడప ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.

టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీకి ఓటు వేశారనే ఉద్దేశంతో 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారని.. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని... టీడీపీ శ్రేణులు దాడులను వెంటనే ఆపకపోతే రానున్న రోజుల్లో టీడీపీ వాళ్లకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. శిశుపాలుడి పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకు కూడా చుట్టుకుంటాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. నాయకులుగా ఉన్న మనం దాడుల సంస్కృతిని ప్రోత్సహించకూడదన్నారు. మోసపూరిత వాగ్దానాల వల్లే చంద్రబాబు గెలిచారని వైఎస్ జగన్ ఆరోపించారు.

Next Story