ఏలూరులో జిల్లాలో 13 మందికి ఫుడ్ పాయిజన్
దెందులూరు మండలం సింగవరం గ్రామంలో 13 మందికి నాసిరకం ఆహారం విషతుల్యమైంది. సమాచారం మేరకు భీమడోలు మండలం
By అంజి Published on 28 April 2023 8:15 AM IST
ఏలూరులో జిల్లాలో 13 మందికి ఫుడ్ పాయిజన్
కాకినాడ: దెందులూరు మండలం సింగవరం గ్రామంలో 13 మందికి నాసిరకం ఆహారం విషతుల్యమైంది. సమాచారం మేరకు భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో బుధవారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ మిగిలిన ఆహారాన్ని సింగవరం ప్రజలు తమ గ్రామానికి తీసుకెళ్లి గురువారం మళ్లీ తిన్నారు. వారు వెంటనే అస్వస్థతకు గురయ్యారు. సుమారు 13 మంది వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారిలో చాలామంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం108 అంబులెన్స్ ద్వారా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైనా వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఏలూరు ఆర్డీఓ కె.పెంచల కిషోర్ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరిశీలించారు. గుండుగొలను సమీపంలో జరిగిన ఓ ఫంక్షన్లో మిగిలిన ఆహారాన్ని తిన్నారని ఎంఆర్వో నాంచారయ్య తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దెందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆరా తీశారు.